సౌత్ డిస్కమ్ పరిధిలో70 కొత్త సబ్ స్టేషన్లు రెడీ..త్వరలో ప్రారంభానికి ఏర్పాట్లు 

సౌత్ డిస్కమ్ పరిధిలో70 కొత్త సబ్ స్టేషన్లు రెడీ..త్వరలో ప్రారంభానికి ఏర్పాట్లు 
  • నిరుడు రూ.300 కోట్లతో కొత్తగా 100 చోట్ల నిర్మాణం 
  • 9 నెలల్లోనే 70 ప్రాంతాల్లో పూర్తి
  • మిగిలిన 30 చోట్ల జూన్ కల్లా పూర్తిచేస్తామన్న సీఎండీ 
  • కరెంట్​సమస్యలకు క్రమంగా చెక్​

హైదరాబాద్, వెలుగు: పవర్​ లోడ్​ తగ్గించి, కోతలకు చెక్​ పెట్టేందుకు సౌత్​ డిస్కమ్​ పరిధిలో కొత్తగా నిర్మించిన 70 విద్యుత్​ సబ్ స్టేషన్  పనులు పూర్తయ్యాయి. వీటిని త్వరలో ప్రారంభించడానికి ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. నిరుడు రూ.300 కోట్ల బడ్జెట్​తో సౌత్​ డిస్కమ్​ పరిధిలోని పలు జిల్లాల్లో  వంద 33/11 కేవీ సబ్​స్టేషన్​ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

9 నెలల్లోనే 70 చోట్ల పనులు పూర్తికాగా, మరో 30 చోట్ల కూడా జూన్​ నెలాఖరు కల్లా పనులు పూర్తి చేస్తామని ఎస్​పీడీసీఎల్​ సీఎండీ జితేష్​ పాటిల్​ తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్​ వినియోగం ఏటా పెరుగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి చివరి వారంలో 18,228 మెగావాట్ల గరిష్ట విద్యుత్​ డిమాండ్​ రికార్డయింది. ఇందులో దక్షిణ డిస్కమ్​ పరిధిలోనే 11,129 మెగావాట్ల పీక్​ డిమాండ్ ​ నమోదైంది.

ఇదే సమయంలో గ్రేటర్​ హైదరాబాద్​లో 4,421 మెగావాట్లకు చేరుకున్నది. భవిష్యత్​ విద్యుత్​ డిమాండ్​ అవసరాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. నిరుడు కొత్తగా వంద విద్యుత్​ సబ్ స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ పనుల కోసం రూ.300 కోట్లు కేటాయించింది.  

సిద్దిపేట జిల్లాలో 11 సబ్ స్టేషన్లు రెడీ

దక్షిణ డిస్కమ్​ పరిధిలో కొత్తగా నిర్మించిన సబ్ స్టేషన్లలో సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా11 సబ్ స్టేషన్​ పనులు పూర్తయ్యాయని ఇంజినీర్లు ప్రకటించారు.  తర్వాత నల్గొండ జిల్లాలో 9, జోగుళాంబ గద్వాల జిల్లాలో 8, సంగారెడ్డి జిల్లా, గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో 7 చొప్పున, మెదక్​, వనపర్తి జిల్లాలో 6 చొప్పున, మహబూబ్​నగర్​ జిల్లాలో 5, సూర్యాపేట, నాగర్​కర్నూల్​జిల్లాలో 3 చొప్పున, నారాయణ ఖేడ్, వికారాబాద్​​జిల్లాలో 2 చొప్పున, యాదాద్రి జిల్లాలో ఒక సబ్​స్టేషన్​ పనులు పూర్తి అయ్యాయని డిస్కమ్​ ఇంజినీర్లు వివరించారు. వీటి నిర్మాణం కోసం రూ.217.25 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

సబ్ స్టేషన్లు ప్రారంభమైతే తగ్గనున్న విద్యుత్​ సమస్యలు

దక్షిణ డిస్కమ్​ పరిధిలో 1.20 కోట్ల వివిధ రకాల విద్యుత్​ కనెక్షన్లు ఉన్నాయి.  విద్యుత్​ వినియోగం ఎక్కువగా జరిగే హెచ్​టీ విద్యుత్​ కనెక్షన్లు ఈ డిస్కమ్​ పరిధిలోనే ఎక్కువ. డిస్కమ్​ పరిధిలో మొత్తం 16 వేలకు పైగా హెచ్​టీ కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతినెలా రూ.2 వేల నుంచి రూ.2,500 కోట్ల వరకు కరెంట్​ బిల్లులు వసూలు అవుతాయి.

కొత్తగా చేపట్టిన విద్యుత్​ సబ్ స్టేషన్లలో పనులు పూర్తయిన 70 సబ్​స్టేషన్లను ప్రభుత్వం ప్రారంభిస్తే ఈ నెల, రాబోయే ఖరీఫ్​ సీజన్​లో విద్యుత్​ సమస్యలను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎండలు విపరీతంగా పెరగడంతో కరెంట్​ లోడ్​ఎక్కువై ఈ డిస్కం పరిధిలో గడిచిన నెల రోజుల్లో సుమారు 600కు పైగా డిస్ట్రిబ్యూషన్​ ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయాయి. కొత్త సబ్​స్టేషన్ల రాకతో లోడ్​ సమస్యలు తగ్గిపోతాయని ఇంజినీర్లు చెబుతున్నారు.